రాష్ట్రపతి జీతాన్ని పెంచిన జైట్లీ
posted on Feb 1, 2018 1:53PM
ఇప్పుడు దేశంలోని అత్యున్నత అధికారుల కంటే ఆ అధికారులందరికీ బాస్ అయిన రాష్ట్రపతి వేతనం చాలా తక్కువ. 7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం ప్రభుత్వ అధికారుల వేతనాలు పెరిగాయి. కానీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాల్లో ఎటువంటి మార్పులు రాలేదు. చివరికీ దేశంలో అత్యున్నత అధికారి అయిన కేబినెట్ సెక్రటరీ జీతం కన్నా.. రాష్ట్రపతి వేతనం తక్కువగా ఉండటంతో దీనిపై విమర్శలు వచ్చాయి. దీంతో వీరి వేతనాల పెంపుపై హోంమంత్రిత్వ శాఖ సిద్ధం చేసిన ముసాయిదాను.. పరిశీలించిన మంత్రిమండలి ఇందుకు ఆమోదముద్ర వేసింది. దీనికి అనుగుణంగా 2018-19 వార్షిక బడ్జెట్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాలను పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్సభకు తెలిపారు. దీని ప్రకారం రాష్ట్రపతి రూ.5లక్షలు. ఉపరాష్ట్రపతి రూ.4లక్షలు, గవర్నర్లు రూ.3.5లక్షల వేతనాన్ని పొందనున్నారు.