ధోనీకి ఏపీ కోర్టు అరెస్టు వారెంట్

 

ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి అరెస్టు వారెంటు జారీ అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం కోర్టు ధోనీ అరెస్టుకు మంగళవారం వారెంట్ జారీ చేసింది. బిజినెస్ టుడే పత్రిక గతంలో తన కవర్ పేజీ మీద విష్ణుమూర్తి అవతారంలో ఉన్న ధోనీ చిత్రాన్ని ముద్రించి, చేతిలో బూటు ఉంచడంపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతపురం జిల్లాకి చెందిన విశ్వహిందూ పరిషత్‌కి చెందిన వారు ఆమధ్య ఈ విషయం మీద అనంతపురం కోర్టును ఆశ్రయించారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా ఫొటో ముద్రించినందున ధోనీ, చైతన్య కల్బగ్‌లపై చర్యలు తీసుకోవాలంటూ అప్పుడు కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఎస్‌సి అండ్ యస్‌టి కోర్టు విచారణకు హాజరు కావాలని మూడుసార్లు ధోనీకి సమన్లు పంపినా హాజరు కాకపోవటంతో మంగళవారం న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.