TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కవిత పార్టీ ప్రకటన సభకు అట్టహాసంగా ఏర్పాట్లు

Published on: Fri Apr 24, 2026 8:10PM

 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం తెలంగాణ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయానికి వేదికగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

దాదాపు రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో సాంస్కృతిక విప్లవానికి ఊతమిచ్చేలా తెలంగాణ జాగృతిని స్థాపించిన కవిత, తన 20 ఏళ్ల ప్రజా జీవితంలో ఎన్నో మైలురాళ్లు దాటడంతో పాటు పలు రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.

తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం స్వీయ రాజకీయ శక్తి అవసరమనే నినాదంతో ఆమె నేడు కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. అద్వయ కన్వెన్షన్ సెంటర్‌తో పాటు దానికి ఆనుకుని ఉన్న 20 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభా ప్రాంగణం నుంచి పార్టీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.

కవిత కార్యక్రమాల షెడ్యూల్ ఇలా ఉంది:
• ఉదయం 7.30 గంటలకు బంజారాహిల్స్‌లోని నివాసం నుంచి ర్యాలీగా అమరవీరుల స్తూపానికి బయల్దేరుతారు
• ఉదయం 8.15 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు
• ఉదయం 8.25 గంటలకు అక్కడి నుంచి బయల్దేరుతారు
• ఉదయం 9.30 గంటలకు మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ హాల్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుంటారు
• ఉదయం 10.00 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు
• ఉదయం 10.05 గంటలకు ప్రసంగం ప్రారంభిస్తారు
• గంటా పావు నుంచి గంటన్నర వరకు కవిత ప్రసంగించే అవకాశం ఉంది

సభా ప్రాంగణానికి ప్రత్యేక పేర్లు కూడా ఖరారు చేశారు:
• సభా ప్రాంగణం – ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం
• ప్రధాన ద్వారం – ప్రజాకవి కాళోజీ నారాయణరావు ద్వారం
• ఇతర ద్వారాలు – రాణి రుద్రమదేవి ద్వారం, మారోజు వీరన్న ద్వారం, చాకలి ఐలమ్మ ద్వారం
కవిత ప్రకటించబోయే కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.