ఏపీఎస్ ఆర్టీసీ భారీ షాక్.. ఒకేసారి ఆరు వేల మందిపై వేటు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ ఆర్టీసీ భారీ షాకిచ్చింది. ఒకేసారి ఆరు వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి విధులకు హాజరుకావొద్దంటూ వారికి డిపో మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. 

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు కూడా ఇంకా అందలేదు. అసలే ఏప్రిల్ నెల జీతాలు అందక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న ఉద్యోగులకు.. ఇప్పుడు ఏకంగా ఉద్యోగాలను తొలగిస్తూ ఆర్టీసీ భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం తీరును తప్పుపడుతున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. బాలకాశి, కార్యదర్శి నూర్ మొహమ్మద్ డిమాండ్ చేస్తున్నారు.