జయలలిత మృతి కేసులో ట్విస్ట్... అపోలో చైర్మన్‌ కు నోటీసులు..

 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎన్నో అనుమానాలు తలెత్తిన సంగతి తెలిసిందే. అంతేకాదు జయలలిత సన్నిహితురాలైన శశికళపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా... జయలలితకు చికిత్స జరిపిన అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్‌ సీ రెడ్డిని విచారించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్..  జయలలిత మృతి మిస్టరీపై విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో భాగంగా... ప్రతాప్‌ సీ రెడ్డిని విచారణకు రావాలని ఆదేశాలు ఇస్తూ, అందుకు వారం రోజుల సమయం ఇస్తూ, నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక, ఆమెకు అందించిన చికిత్స, చేసిన వైద్య పరీక్షలు తదితరాలపై సమాచారం కోసం అపోలో హాస్పిటల్ కు సమన్లు పంపింది. ఇప్పటికే ఈ సమన్లకు అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, ఆయన కుమార్తె ప్రీతా రెడ్డి తరఫున ఆసుపత్రి అధికారులు నివేదికను పంపగా, మరికొన్ని అంశాల గురించి సమగ్రంగా విచారించేందుకు ప్రతాప్‌ సీ రెడ్డిని విచారణకు పిలవాలని కమిషన్ నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో ఆయనకు సమన్లు పంపి, ఆపై వారంలోపు విచారించాలని కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం.