ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లు అవుట్  

పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. పంచాయతి ఎన్నికల విధులను ఎట్టిపరిస్థితుల్లోనూ వాలంటీర్లకు అప్పగించొద్దని  స్పష్టం చేశారు. ఎన్నికల సన్నాహకంలో భాగంగా బుధవారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సినేషన్ ఆగకూడదని స్పష్టం చేశారు. ఎన్నికలకు రాష్ట్ర యంత్రాంగం సహకరించకపోతే కేంద్ర బలగాలు వస్తాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఓ ప్రత్యేక యాప్ తీసుకొచ్చిందని.. గొడవలు, అసాంఘీక చర్యల సమాచారాన్ని పౌరులు ఈ యాప్ ద్వారా పంపొచ్చని వెల్లడించారు. 
     
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను స్వాగతించాలని నిమ్మగడ్డ రమేస్ కుమార్ స్పష్టం చేశారు. ప్రత్యేక అధికారి సంజయ్ అదే బాధ్యతలు చూస్తారన్నారు. ఏకగ్రీవాలు బలవంతంగా అవుతున్నాయా? లేదా అన్నదే పర్యవేక్షిస్తారని చెప్పారు. అయితే మొదటి ప్రాధాన్యంగా ఎన్నికలు తీసుకోవాలని సూచించారు. తరువాత స్థానాల్లో సంక్షేమం కూడా తీసుకోవాలని, కాల్‌ సెంటర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని నిమ్మగడ్డ సూచించారు. వెబ్‌కాస్టింగ్‌తో ఉపయోగం లేదని, పోలింగ్‌ కేంద్రం చుట్టూ కొంత ప్రాంతాన్నే అది కవర్‌ చేస్తుందని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. వెబ్‌కాస్టింగ్‌ కోసం కొత్త యాప్‌‌ను తీసుకువచ్చామని, ఆ యాప్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాల దగ్గర జరిగేదంతా తెలుసుకోవచ్చునని అన్నారు. యాప్‌ ద్వారా వీడియోలతో పాటు ఎస్ఎంఎస్ కూడా పంపవచ్చునని రమేష్ కుమార్ పేర్కొన్నారు.