ఏపీ ఎన్నికల సంఘం జేడీపై ఎస్ఈసీ వేటు 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో మరింత దూకుడు పెంచిన ఏపీ ఎన్నికల సంఘం. శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసీ.. ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో విధుల్లో  నిర్లక్ష్యంగా ఉంటున్న ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటోంది. ఏపీ ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్‌పై ఎస్ఈసీ వేటు వేసింది. జేడీ జీవీ సాయిప్రసాద్‌ను ‌విధుల నుంచి తొలగించింది. ఆర్టికల్ ‌243 రెడ్‌విత్‌, ఆర్టికల్‌ 324 ప్రకారం విధుల నుంచి సాయిప్రసాద్‌ని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ విధులు నిర్వహించడానికి వీలులేదని ఎస్ఈసీ తేల్చి చెప్పింది. 

 నాలుగు దశల్లో  గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్‌ ప్రకటించిన సమయంలో.. ఈ నెల 9వ తేదీ నుంచి ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలోని సీనియర్‌ ఉద్యోగులు ఎవరూ సెలవులు తీసుకోరాదని, అందరూ అందుబాటులో ఉండాలని ఎస్‌ఈసీ సూచించింది. అయితే అందుకు భిన్నంగా కార్యాలయంలో సంయుక్త సంచాలకులు సాయిప్రసాద్‌ 30 రోజుల  సెలవులపై వెళ్లారు. ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని జీవీ సాయి ప్రసాద్‌పై అభియోగాలు ఉన్నాయి. దీన్ని క్రమశిక్షణారాహిత్యంగా ఎన్నికల కమిషన్ పరిగణించింది. ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా చర్యలున్నాయని పేర్కొంటూ వేటు వేసింది. 

 ఏపీ ఎన్నికల సంఘం తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణకు దూరంగా ఉండే ఉద్యోగులకు హెచ్చరిక  జారీ చేసినట్లుగా చెబుతున్నారు. రాజ్యాంగ బద్ద సంస్థ అయిన ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాలను ఉద్యోగులు తప్పక పాటించాల్సిందే. లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల కమిషనర్ కు ఉంటుంది.