రేవంత్ రెడ్డికి స్టార్ట్ అయింది....
posted on Oct 20, 2017 12:26PM
తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని.. అంతేకాదు ఢిల్లీ కి వెళ్లిన ఆయన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుస్తారని వార్తలు హల్ చల్ చేశాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన రేవంత్ రెడ్డి.. తాను ఏపార్టీలో చేరే అవకాశం లేదని...టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు వేసేందుకే తాను ఢిల్లీ వెళ్లానని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ‘గులాబీ కూలీ’ పేరుతో చందాల వసూలుపై ఢిల్లీలో కేసు వేస్తానని, కొన్నిరోజులుగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నామని వార్తల్లో నిజం లేదని.. పొత్తులు పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా...ఏపీ టీడీపీ నేతలపై కూడా విమర్శలు గుప్పించారు. ఏపీ మంత్రులకు తెలంగాణలో పనేంటని... పరిటాల శ్రీరామ్ పెళ్లికి వచ్చిన కేసీఆర్ తో టీడీపీ నేతలకు అంతసేపు ముచ్చట్లు ఏంటని.. టీడీపీ మంత్రులు పరిటాల సునీత, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుల కుటుంబాలు వ్యాపారాలు చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అనుమతులు ఇచ్చారని, వారు ఇప్పుడు సీఎం కేసీఆర్పై ఈగ అయినా వాలనిస్తారా ? అని ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డిపై కౌంటర్లు స్టార్ట్ అయ్యాయి.
మంత్రి సునీత తనయుడు శ్రీరామ్ అయితే రేవంత్కు అదిరిపోయే కౌంటర్ ఇస్తూ ఓ లేఖ కూడా రాశారు. ఈ లేఖలో రేవంత్ పార్టీ మారాలనుకుంటే మారవచ్చని…. అయితే ఇందుకు తమను విమర్శించడం తగదని ఘాటుగానే స్పందించారు.
ఇక మంత్రి యనమల పై విమర్శలు గుప్పించడంపై పిఠాపురం ఎమ్మెల్యే వర్మ స్పందించి సీరియస్ అయ్యారు. యనమలను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదని.. యనమల రాజకీయ జీవితమంతా లేదు రేవంత్ వయసని... టెండర్లలో ఎవరో పనులు దక్కించుకుంటే యనమలకు ఆపాదించడం తప్పు అని తెలిపారు. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీపై విమర్శలు సరికాదని వర్మ పేర్కొన్నారు. మరి ఇంకా ఎంతమంది.. రేవంత్ రెడ్డికి కౌంటర్లు ఇస్తారో చూద్దాం...