ఆంధ్రా పోలీసులపై తమిళ రౌడీల దాడి

ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తమిళనాడుకు చెందిన రౌడీలు దాడికి దిగారు. ఇది ఎక్కడో శేషాచలం అడవుల్లో జరిగింది కాదు..నడిరోడ్డుపై జరిగిన సంఘటన. అసలు మ్యాటరేంటంటే, 2009లో గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఓ మహిళ కిడ్నాప్‌కు సంబంధించి మదన్‌రెడ్డి అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. గత వారం న్యాయస్థానం అతని అరెస్ట్‌కు వారెంట్ జారీ చేసింది. మదన్‌రెడ్డి ఆచూకీని తమిళనాడులోని అరక్కోణం ప్రాంతంలో గుర్తించిన పోలీసులు అతనిని అదుపులోకి తీసుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ శ్యాంసన్ ఆధ్వర్యంలో మరో ముగ్గురు కానిస్టేబుళ్లు అరక్కోణం చేరుకున్నారు. మదన్‌ను అరెస్ట్ చేసి ఓ అద్దెకారులో ఏపీకి తీసుకువస్తుండగా నిన్న రాత్రి 8 గంటల సమయంలో తిరుత్తణి సమీపంలో చెన్నై, తిరుపతి జాతీయ రహదారిపై కొందరు దుండగులు వారిపై దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేసి, వీరిపై అటాక్ చేశారు. పోలీసులు తెరుకునే లోపే మదన్ రెడ్డిని తీసుకుని పారిపోయారు. గాయపడిన పోలీసులను స్థానికులు తిరుత్తణి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు నిందితులను వేటాడే పనిలో ఉన్నారు.