TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేషన్ బియ్యం బస్తాలకు క్యూఆర్ కోడ్.. ఏపీ మోడల్ దేశానికే ఆదర్శం!

Published on: Wed Jun 10, 2026 9:20AM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందుతున్న రేషన్ బియ్యం పంపిణీలో  కొత్త విప్లవం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేసిన  క్యూఆర్ కోడ్ టెక్నాలజీ విధానం విజయవంతమైంది. పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా..  అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయడంలో ఈ ఏపీ మోడల్ అత్యంత ప్రతిభామంతమైనదిగా రుజువైంది. పనిచేసింది. ఈ  డిజిటల్ నమూనాకు  కేంద్రం ఫిదా అయ్యింది.  ఏపీ నమూనా స్ఫూర్తితో ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ  పరిధిలోని రేషన్ బియ్యం బస్తాలన్నింటికీ క్యూఆర్ కోడ్ విధానాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం (జూన్ 10)  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలో  మీడియా సమావేశంలో  మాట్లాడిన ఆయన  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికతను జోడించి రేషన్ పంపిణీని పర్యవేక్షిస్తున్న తీరును ప్రశంసలతో ముంచెత్తారు.  మిల్లింగ్ పాయింట్ దగ్గర బియ్యం బస్తా తయారైన క్షణం నుండి..  అది గిడ్డంగికి చేరి, అక్కడి నుండి లబ్ధిదారుడి చేతికి వెళ్లే వరకు ప్రతి ఒక్క దశను డిజిటల్‌గా ట్రాక్ చేసే వీలు కల్పించేలా ఏపీ సర్కార్  క్యూఆర్ కోడ్ విధానాన్ని అవలంబిస్తోందన్నారు. ఈ పారదర్శకత వల్ల లీకేజీలు పూర్తిగా అగిపోయాయని, అర్హులైన ప్రతి పేదవాడికి సబ్సిడీ  బియ్యం అందుతోందన్నారు.  

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత, డిజిటల్ ఇండియా సంకల్పానికి అనుగుణంగానే ఏపీ అమలు చేస్తున్న ఈ విధానం దేశానికే ఆదర్శమన్న ఆయన ఇక  దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేసి, రేషన్ బియ్యం మాఫియాకు పూర్తిగా చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తోందని చెప్పారు.  సాంకేతికతను పాలనలో భాగం చేయడం ద్వారా సామాన్యులకు ఎంతటి మేలు జరుగుతుందో చెప్పడానికి ఈ ఏపీ రేషన్ ట్రాకింగ్ విధానమే ఉదాహరణ అన్నారు.