మహిళతో రాజీ..రావెల సుశీల్ కేసు కొట్టివేత..

మహిళను చేయిపట్టుకుని బలవంతంగా లాగిన కేసులో మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు, రావెల సుశీల్‌పై నమోదైన కేసును తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. గత నెల 4వ తేదిన హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.13లో మద్యం మత్తులో రోడ్డుపై నడిచి వెళుతున్న ఫాతిమా అనే మహిళను సుశీల్, కారు డ్రైవర్ అప్పారావు కారులోకి బలవంతంగా లాగే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు సుశీల్, అప్పారావును చితకబాది పోలీసులకు అప్పగించారు. దీనిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సుశీల్ బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఫిర్యాదుదారు ఫాతిమా బేగంతో రాజీ కుదిరిందని సుశీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేసును కొట్టివేసింది. పిటిషనర్లు, ఫిర్యాదు దారులు రాజీకి రావడంతో కేసును కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.