ఏపీ మంత్రి పుష్ప శ్రీవాణి అసలు 'ఎస్టీ'నే కాదు.. ఇదే రుజువు

 

ఏపీ సీఎం జగన్ తన కేబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలను తీసుకున్న విషయం తెలిసిందే. ఆ ఐదుగురిలో విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించన పుష్ప శ్రీవాణి కూడా ఒకరు. ఆమెకు జగన్ గిరిజన సంక్షేమ శాఖ కూడా అప్పగించారు. అయితే జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స ఆరోపిస్తున్నారు. ఆమె కులానికి సంబంధించిన కేసు కోర్టు విచారణలో ఉందని, అటువంటప్పుడు ఆమెను ఎస్టీగా పరిగణిస్తూ, మంత్రివర్గంలోకి తీసుకుని, గిరిజన సంక్షేమ శాఖను ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు.

తాజాగా అరకులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పుష్ప శ్రీవాణి సోదరి రామతులసి ఎస్టీ కాదని గతంలో అధికారులు ధ్రువీకరించారని, దాంతో ఆమె తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. సోదరి రామతులసి ఎస్టీ కానప్పుడు.. పుష్పశ్రీవాణి ఎస్టీ ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. ఆమె తొలిసారి గెలిచినప్పుడే కోర్టులో కేసు దాఖలైందని, అది ఇంకా విచారణలో ఉండగానే, రెండోసారి ఆమెకు టికెట్‌ ఇచ్చారని అన్నారు. అసలు ఆమెకు డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖలను ఎలా ఇస్తారని అప్పలనర్స అభ్యంతరం వ్యక్తం చేశారు.