శాసనమండలికి మంత్రి నారాయణ

 

విద్యావేత్త నారాయణ ఆంధ్రప్రదేశ్ శాసనసభలోగానీ, శాసన మండలిలోగానీ సభ్యుడు కాకుండానే రాష్ట్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. చట్ట ప్రకారం ఆయన మంత్రిపదవి చేపట్టిన ఆరు నెలల లోగా శాసన సభకు గానీ, శాసన మండలి గానీ ఎంపిక కావలసి వుంది. ఈ నేపథ్యంలో ఆయనను శాసన మండలికి సభ్యుడిగా ఎంపిక చేయడానికి తెలుగుదేశం పార్టీ సన్నాహాలు చేస్తోంది. మే 21న కోలగట్ల వీరభద్ర స్వామి శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ ఖాళీని నారాయణతో భర్తీ చేయాలని తెలుగుదేశం భావిస్తోంది. ఈ స్థానానికి ఆగస్టు 21వ తేదీన ఉప ఎన్నిక జరగబోతోంది. ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఈ ఉప ఎన్నికకు ఆగస్టు నాలుగో తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆగస్టు 11వ తేదీలోగా నామినేషన్లు దాఖలుచేయాలి. ఉపసంహరణకు తుదిగడువు ఆగస్టు 14. అవసరమైతే 21వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉండటం వల్ల ఎమ్మెల్సీ పదవికి నారాయణ ఎంపిక లాంఛనమే అవుతుంది.