50 కోట్లు ఆఫర్ చేసిన బాబు.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!!
posted on Jun 17, 2019 3:48PM
ఏపీ మంత్రి గుమ్మనూర్ జయరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆలూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన జయరామ్.. వైఎస్ జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణ చేశారు. గతంలో చంద్రబాబు రూ.50 కోట్లు డబ్బు, ఒక మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చాడని అయితే దాన్ని సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చారు. డబ్బుకు అమ్ముడుపోకుండా నీతిగా నిలిచినందుకే సీఎం జగన్ తనను మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. తాను నీతిగా ఉంటూ తన సామాజిక వర్గమైన బోయలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చానంటూ మీసం మెలేశారు. కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి వంటి వాళ్లు కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి టీడీపీలో చేరిపోతే తాను మాత్రం చేరలేదని మంత్రి జయరామ్ చెప్పుకొచ్చారు.