హరీశ్ రావుకు బాలినేని కౌంటర్.. ఆ రూ.4వేల కోట్లు మా జేబుల్లో వేసుకోవట్లేదు

ఏపీ అధికార పార్టీ వైసీపీ, తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ మధ్య దూరం పెరుగుతుందా అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగింపు అంశంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం ఇస్తామన్న రూ.4 వేల కోట్లకు ఆశపడి సీఎం జగన్ మీటర్ల పేరుతో ఏపీ రైతుల మెడకు ఉచ్చు బిగిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లకు‌ మీటర్లు పెడితే.. తెలంగాణకు రూ.2500 కోట్లు, ఏపీకి రూ.4వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందని.. అయితే తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. కేంద్రం డబ్బుకు కక్కుర్తి పడి రైతుల మెడకు ఉరితాడు బిగించలేమని అన్నారు. కానీ, రూ.4 వేల కోట్లకు ఆశపడిన ఏపీ సీఎం జగన్.. మీటర్ల బిగింపుకు సమ్మతించారని వ్యాఖ్యానించారు.

 

హరీష్ రావు వ్యాఖ్యలపై తాజాగా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. మీటర్లు అమర్చే విషయంలో కేంద్రంతో సఖ్యతగా ఉంటూ కష్టాల్లో ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రానికి మద్దతు ఇచ్చామన్నారు. కేంద్రం ఇచ్చే రూ.4 వేల కోట్ల నిధులను ప్రజా సంక్షేమం కోసమే ఉపయోగిస్తాం తప్ప, వాటిని తమ జేబుల్లో వేసుకోమనే విషయాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు గ్రహించాలి అన్నారు. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వంలా కేంద్రంతో ఒకరోజు మంచిగా ఉండడం, మరో రోజు గొడవ పడడం తమ నైజం కాదని చురక అంటించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతతో ఉండడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ బిల్లులకు సంబంధించి డిస్కంలకు చెల్లించవలసిన మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేస్తామని, దీనిపై ఎవ్వరూ అనుమాన పడవలసిన అవసరంలేదన్నారు. కాగా, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతతో ఉండడం తప్పెలా అవుతుందన్న బాలినేని.. ముందు ముందు కేంద్ర సహకారంతో.. రాష్ట్రానికి ఏమేం తీసుకొస్తారో, రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తారో చూడాలి.