రెండురాష్ట్రాల మధ్య నలిగిపోతున్న 12 గ్రామాలు
Published on: Mon May 7, 2012 9:50AM
ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర సరిహద్దుల మధ్య ఉన్న 12 గ్రామాలు అనాథలుగా మారాయి. ఈ గ్రామాలు మాకు చెందాలంటే కాదు మాకు చెందాలంటూ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు ఎక్కాయి. 15 ఏళ్ళుగా ఈ కోర్టుకేసు ఒక కొలిక్కి రాలేదు. కేసు కోర్టులో ఉండటంతో ఈ గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికీ ఆ గ్రామాలు ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య నలిగిపోతూ తాగునీటికి సైతం నోచుకోక అల్లాడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. గత 15 ఏళ్ళుగా ఈ 12 గ్రామాలకు అటు మహారాష్ట్ర అధికారులు కానీ, ఇటు ఆంద్ర అధికారులు కానీ వెళ్ళటం లేదు. వారికి రేషన్ కార్డులు కానీ, ఇతర సదుపాయాలూ కానీ లభించటం లేదు. గ్రామాల్లో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి.
ఈ గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు అమలు కాకపోవటంతో గ్రామస్థులు మైళ్ళ తరబడి కాలినడకన ఇతర ప్రాంతాలకు వచ్చి నీటిని తీసుకువెళ్ళాల్సి వస్తోంది. గ్రామంలో నీరు, రహదారులు లేకపోవటంతో మిగిలిన ప్రాంతంలో వీటికి సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామాల్లోని యువతీ, యువకులకు పెళ్ళిళ్ళు కావటం కూడా కష్టంగా మారింది. 15 ఏళ్ళుగా తమ గోడును ఎవరూ పట్టించుకోవటం లేదనీ, తమ పరిస్థితి రెండింటికీ చెడ్డ రేవడిలా మారిందని ఈ 12 గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


