TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ లింకు?

Published on: Mon Aug 22, 2022 2:02PM

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయనడానికి సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇంత కాలం ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై సాఫ్ట్ కార్నర్ తో ఉన్న కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పుడు ఆ వైఖరి మార్చుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతాలను ఇస్తోంది. ఒక వైపు ఏపీలో బీజేపీ టీడీపీల మైత్రి ఖాయమన్న సంకేతాలు కేంద్రం నుంచే వస్తున్నాయి.

ఆ సంకేతాలకు బలం చేకూర్చే విధంగా రాష్ట్ర బీజేపీ వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అదే సమయంలో కేంద్ర మంత్రి తన ఏపీ పర్యటనలో నేరుగా ముఖ్యమంత్రి జగన్ పైనే త్రీవ స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎంను లిక్కర్ కింగ్ గా, స్టిక్కర్ కింగ్ గా అభివర్ణించారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ లింకు ఉందా? ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాత్రం అవుననే అంటున్నారు.

త్వరలోనే ఆ విషయం బయటకు వస్తుందని ఘంటాపదంగా చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్  కుమార్తె కవిత హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏకంగా కేంద్ర మంత్రి ఈ కుంభకోణంలో ఏపీ లింకులను బయట పెడతానని ప్రకటించడం సంచలనం సృష్ఠించింది. అంతటితో ఆగకుండా ఆయన సీఎం జగన్ నే లిక్కర్ కింగ్ గా అభివర్ణించడంతో ఆయన త్వరలో బయటపెట్టబోయే విషయాలు మరింత సంచలనాత్మకంగా ఉండనున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో జరిగిన యువ సంఘర్షణ ర్యాలీ ముగింపు సభలో పాల్గొన్న ఆయన ఏపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి బీజేపీ తరఫున ప్రధానంగా మాట్లాడుతున్నది అనురాగ్ ఠాకూరే.. దీంతో ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో ఏపీకి లింక్ ఉందని ఆరోపించడంతో ఆ ఆరోపణలకు విశ్వసనీయత పెరిగింది. ఏపీలో లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియాల హవా నడుస్తోందని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అవినీతిలో అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నారని విమర్శించారు. ఏపీలో జగన్ విధానాల కారణంగా యువతకు ఉపాధి లేకుండా పోయిందని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.  ఏపీ సర్కార్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా అభివృద్ధి అన్నది కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదని విమర్శించారు. ఒక్కరాజధాని కట్టడానికే డబ్బులు లేని ఏపీలో జగన్ మూడు రాజధానులు కడతానని ఎలా చెబుతారని విమర్శించారు.  జగన్ సర్కార్ తీరు కారణంగా ఏపీలో ఉన్నపరిశ్రమలే తరలిపోయే పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు.  ఢిల్లీ లిక్కర్ స్కాంతో నేరుగా ఏపీ ప్రభుత్వ పెద్దల లింక్ బయట పెట్టబోతున్నామని అనురాగ్ ఠాకూర్ ప్రకటించి ప్రకంపనలు సృష్టించారు.