హైకోర్టులో జగన్ సర్కార్ కి ఊరట.. ఇప్పట్లో స్థానిక ఎన్నికలు లేనట్టే!
posted on Jan 11, 2021 4:14PM
ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కి ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కు గట్టి షాక్ తగిలినట్లయింది. కాగా, ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ షెడ్యూల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంపై జగన్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను కొట్టివేసింది. ఏకకాలంలో ఎన్నికలు, వ్యాక్సినేషన్ కష్టమని ప్రభుత్వం వాదించింది. వ్యాక్సినేషన్ కు ఎన్నికల ప్రక్రియ అడ్డొస్తుందని హైకోర్టు భావించింది. ప్రజారోగ్యం, వ్యాక్సిన్ పంపిణీని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల షెడ్యూల్ను సస్పెండ్ చేస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తాజా నిర్ణయంతో ఇప్పట్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టేనని స్పష్టమైంది. ఇదిలా ఉండగా.. హైకోర్టు తాజా తీర్పుపై డివిజన్ బెంచ్కు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.