నవయుగ పిటిషన్ పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు?
posted on Aug 20, 2019 5:06PM
పోలవరం రివర్స్ టెండరింగ్ అంశంలో నవయుగ కంపెనీ వేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. నవయుగ కంపెనీ ఎటువంటి నిబంధలు ఉల్లంఘించలేదని ఆ కంపెనీ తరఫు న్యాయవాది జి. సుబ్బారావు వాదనలు వినిపించారు. హైడల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి.. జెన్కో సకాలంలో స్థలాన్ని చూపించలేదని అన్నారు. ప్రభుత్వం ఎలాంటి కారణం చూపించకుండా ఒప్పందాన్ని.. ఏకపక్షంగా ఎలా రద్దు చేస్తుందని ఆయన న్యాయస్ధానాన్ని ప్రశ్నించారు. కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తమకు ఇంకా గడువు ఉందని, తమనే కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ.. స్థలం చూపించలేదని మిగతా ప్రాజెక్ట్ల విషయంలో.. నిర్ణయం తీసుకోకూడదనడం ఎలా సమంజసమని ప్రశ్నించారు. నిజానికి నవయుగ కంపెనీ ఆర్బిట్రేషన్కు వెళ్లాలని.. హైకోర్టుకు రావడం సరికాదని అన్నారు. రివర్స్ టెండరింగ్ కొనసాగించుకునేందుకు.. తమ సర్కార్కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పును రిజర్వ్లో ఉంచింది.