ఐపీఎస్ పై దౌర్జన్యం.. టీడీపీ నేతలకు నోటీసులు

 

టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు, సీనియర్‌ నేత నాగుల్‌ మీరాలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, రవాణాశాఖ కమిషనర్ బాల సుబ్రహ్మణ్యం పై దౌర్జన్యం కేసులో వీరికి నోటీసులిచ్చింది. ఓ ట్రావెల్స్ విషయంలో 2017 మార్చిలో రవాణ శాఖ కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి బాల సుబ్రమణ్యంతో పాటు, కొందరు  అధికారులపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారనే  ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ  నేతలపై సీరియస్ అయ్యారు. చంద్రబాబు ఆదేశాల మేరకు వారంతా ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యానికి క్షమాపణలు చెప్పారు. ఇదిలా ఉంటే ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకొంది. ఆ నలుగురు టీడీపీ నేతలకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ కమిషనర్‌ ద్వారా నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణను జూన్‌ నెలకు వాయిదా వేసింది.