అమరావతి భూముల వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వుల పై సుప్రీంకు జగన్ సర్కార్

ఏపీలో అమరావతి భూములకు సంబంచించి స్కామ్ జరిగిందని పేర్కొంటూ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ ను తొలి నిందితుడిగా చేరుస్తూ 13 మంది నిందితులుగా పేర్కొంటూ ఎసిబి కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. అయితే దీనికి వ్యతిరేకంగా అయన ఎపి హైకోర్టును ఆశ్రయించగా ఎఫ్‌ఐఆర్‌లోని సమాచారాన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయకూడదని.. దీని పై విచారణ చేపట్టకూడదని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ కేసు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తొలగించాలని కోరుతూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు ఒకట్రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.