జగన్ సర్కార్ పై కోడెల కుమార్తె ఫిర్యాదు!!

 

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆయనపై కేసులు పెట్టి, ఇబ్బందులకు గురిచేయడం వల్లే మనస్థాపానికి గురై ఆయన ఆత్మహత్య చేసుకున్నారని మండిపడుతున్నారు. కోడెల మరణానికి నైతిక బాధ్యత వైసీపీనే వహించాలని అంటున్నారు. కోడెల కుటుంబసభ్యులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ కక్ష సాధింపు చర్యల కారణంగానే తన తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారని కోడెల కుమార్తె విజయలక్ష్మి బంజారాహిల్స్‌ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఏపీలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం రాజకీయ కక్ష సాధించేందుకు తన తండ్రిని వేధించిందని.. ఆయనపైన, తమ కుటుంబీకులపై తప్పుడు కేసులు బనాయించి మానసిక క్షోభకు గురి చేసిందని ఆరోపించారు. ఇది తట్టుకోలేక తన తండ్రి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఈ ఫిర్యాదుపై జగన్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.