పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా ఉన్న హెచ్‌కే సాహును తప్పిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జలవనరులశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌ ఉత్తర్వులను జారీ చేశారు. 

నెలకు రూ. 2 లక్షల వేతనంతో 2018 ఏప్రిల్‌ 14న అప్పటి ప్రభుత్వం సాహుని కన్సల్టెంట్‌గా నియమించింది. అప్పటి నుండి హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా సాహు పనిచేస్తున్నారు. అయితే..  ఆయన పనితీరు సంతృప్తికరంగా లేదని ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక పంపారు. దీంతో, కన్సల్టెంట్‌గా సాహును తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా.. ఆయన స్థానంలో ఎవరినైనా నియమిస్తారా? లేదా ఆ పోస్టును పూర్తిగా తొలగిస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.