ఏపీ ప్రభుత్వ విప్లుగా మరో ముగ్గురు.. పార్దసారధి అసంతృప్తి
posted on Jun 12, 2019 12:16PM
కొత్తగా మరో ముగ్గురిని ప్రభుత్వ విప్లుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సామినేని ఉదయభాను(జగ్గయ్యపేట), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం) లకు ప్రభుత్వ విప్లుగా అవకాశం కల్పించారు.
నాలుగు రోజుల క్రితం నియమించిన విప్ల్లో పార్ధసారధి ఆ బాధ్యత లు స్వీకరించటానికి నిరాకరించారు. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితో ఉన్న పార్ధసారధి ఈ పదవి నిర్వహించటానికి సుముఖంగా లేరు. దీంతో గతంలో ప్రకటించిన వారిలో ఆయన తప్ప మిగిలిన వారిని కొనసాగిస్తూ.. కొత్తగా మరో ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు.
గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరణ చేస్తూ ప్రభుత్వం విప్లను నియమిస్తూ తాజా ఉత్వర్వులు జారీ చేసింది. దీని మేరకు చీఫ్ విప్గా శ్రీకాంత రెడ్డి వ్యవహరిస్తారు. అదే విధంగా విప్లుగా బూడి ముత్యాల నాయుడు, దాడిశెట్టి రామలింగేశ్వర రావు, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డికి అవకాశం ఇచ్చారు.