జవాన్ల కుటుంబాలకు అండగా ఏపీ ప్రభుత్వం

 

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో అమర జవాను కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన అత్యంత బాధాకారమని చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మనిషి ప్రాణాలు బలితీసుకునే ఈ తరహా దారుణాలు అత్యంత హేయమైనవిగా అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జవాన్ల కుటుంబాలకు అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ వంతు సహకారం అందించాలని చంద్రబాబు కోరారు.