TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

39,436.84 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు పచ్చజెండా!

Published on: Tue Apr 7, 2026 5:22PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రపథాన నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంగళవారం (ఏప్రిల్ 7) జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో  రూ. 39,436.84 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షా 11 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.  

ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన  16వ ఎస్ఐపీబీ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పి. నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరచడం ద్వారా నిరుద్యోగితను తగ్గించడమే ధ్యేయంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ, విద్యుత్, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో ఈ పెట్టుబడులు ప్రధానంగా రానున్నాయి.

రాజధాని ప్రాంతమైన అమరావతిలో  క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో  మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది.   పెట్టుబడుల వివరాలను, ఉద్యోగాల గణాంకాలను పారదర్శకంగా వెబ్‌సైట్‌లో ఉంచాలని   సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

రాయలసీమ ప్రాంతాన్ని దేశానికే తలమానికంగా నిలిచే  సోలార్ హబ్  మార్చాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీమలో సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని, తద్వారా రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని సూచించారు. ఇందుకోసం పటిష్టమైన గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించారు.

ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా ఏపీని మేటిగా నిలబెట్టేందుకు శ్రీసిటీ, అనంతపురం వంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల  ఏర్పాటు ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్ వంటి ఇంధనాలను తయారు చేసే కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.

పరిశ్రమల స్థాపనలో భద్రతా ప్రమాణాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా ఫార్మా మరియు గ్రీన్ ఎనర్జీ విభాగాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్  కచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు.  గత 22 నెలల్లో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ఏపీ అభివృద్ధికి నిదర్శనమన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుల గ్రౌండింగ్ పనులు ప్రారంభించి,  నిర్ణీత గడువులోగా పరిశ్రమలు అందుబాటులోకి వచ్చేలా చేయాలని సీఎం ఆదేశించారు.