బాబు కుటుంబానికి భద్రత తగ్గింపు.. కక్ష సాధింపా?

 

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి భద్రత కుదిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల బాబుకి భద్రత తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు ఆయన కుటుంబానికి కూడా తగ్గించింది. జడ్ కేటగిరి భద్రత కలిగి ఉన్న బాబు కుమారుడు లోకేష్‌కు భద్రతను కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో లోకేష్‌కు 5+5 భద్రత ఉండేది. కాగా ఇప్పుడు 2+2 గన్‌మెన్లకు కుదిస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక మిగిలిన కుటుంబసభ్యులకు భద్రతను పూర్తిగా తొలగించారు. చంద్రబాబు విదేశీ పర్యటనను ముగించుకుని రాగానే ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా భద్రతను ఉప సంహరించారని సమాచారం.
 
చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా భద్రత తగ్గించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కనీస సమాచారం ఇవ్వకుండా భద్రత ఎలా తొలగిస్తారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం భద్రత విషయంలో ఎక్కడా పక్షపాతం చూపలేదని, కానీ వైసీపీ మాత్రం అధికారంలోకి రాగానే చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.