TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పంట రుణాల పేరుతో బ్యాంకులకు రైతులు కుచ్చు టోపీలు

Published on: Thu Oct 9, 2014 3:53PM

 

ఈనెల 22న దీపావళి పండగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి దఫాగా రైతుల పంట రుణాలలో 20 శాతం వారి ఖాతాలలో జామా చేయాలని భావించారు. ఆ క్రమంలో రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు తెప్పించుకొన్న ప్రభుత్వాన్ని పెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే దాదాపు 40శాతం మంది రైతులు ఒకే పంట భూమిపై 12 నుండి 34 బ్యాంకులలో ఖాతాలు తెరిచి రుణాలు తీసుకొన్నట్లు బయటపడింది. నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో ఒక వ్యక్తి 12 బ్యాంకులలో ఖాతాలు తెరిచి పంట రుణాలు తీసుకొంటే, పక్క జిల్లాలో మరో ఘనుడు ఏకంగా 34 ఖాతాలతో మూడు పూవులు ఆరు కాయలన్నట్లు ఒకే పంట భూమిపై ఏకంగా 34సార్లు పంట రుణాలు పొందాడు. అటువంటివన్నీ కలుపుకొని చూసినట్లయితే రాష్ట్రంలో మొత్తం 80 లక్షల పంట రుణాల ఖాతాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నకిలీ ఖాతాలన్నిటినీ గుర్తించి తొలగించగలిగినట్లయితే, ప్రస్తుతం చెల్లించాల్సిన పంట రుణాలలో ఏకంగా సగానికి సగం భారం తగ్గిపోతుందని అధికారులు భావిస్తున్నారు.

 

అయితే నేటికీ చాలా బ్యాంకులు వారి ఖాతాల వివరాలు ప్రభుత్వం చేతికి ఇవ్వనందున, దీపావళినాడు మొదటి దఫా రుణాల మాఫీ ప్రక్రియ ఆలస్యం జరిగేలా ఉందని అధికారులు భావిస్తున్నారు. పైగా ఈ పంట రుణాలు తీసుకొన్న రైతులు, వారి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం తయారు చేసిన 34 కాలమ్స్ తో కూడిన దరఖాస్తులను నింపవలసి రావడం వలన కూడా ఆలస్యమవవచ్చునని భావిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 22న మొదటి దఫా పంట రుణాల చెల్లింపులు జరగవలసిందేనని ఆదేశించినట్లు వారే చెపుతున్నారు.