TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పంట రుణాల మాఫీపై ఆంధ్రా ప్రభుత్వ ఎఫెక్ట్

Published on: Mon Sep 15, 2014 9:01PM

 

ఈరోజు జరిగిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వచ్చే నెల మొదటి వారం నుండి వ్యవసాయ రుణాల మాఫీ కార్యక్రమాన్ని చెప్పట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. తొలివిడతలో రూ.10, 000 కోట్ల రుణాలు మాఫీ చేయబడతాయి. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం రాష్ట్ర రైతాంగానికి చాలా ఆనందం కలుగజేస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ప్రభావం తెలంగాణా ప్రభుత్వం మీద పడే అవకాశం కూడా ఉంది.

 

ఆంద్రప్రదేశ్ కంటే అన్ని విధాల మెరుగుగా ఉన్నప్పటికీ తెలంగాణా ప్రభుత్వం ఇంతవరకు వ్యవసాయ రుణాల మాఫీ వ్యవహారం తేల్చలేదు. కానీ, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం కారణంగా ఇప్పుడు తప్పనిసరిగా తెలంగాణా ప్రభుత్వం కూడా రుణాల మాఫీ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బహుశః త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్టులో దీని కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేయవచ్చును. లేకుంటే తెలంగాణా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్ష పార్టీలకు మరొక మంచి అవకాశం అందించినట్లవుతుంది. ఏమయినప్పటికీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం వలన ఆంద్రప్రదేశ్ రైతాంగానికే కాక, తెలంగాణా రైతాంగానికి కూడా మేలు జరగడం సంతోషమే కదా.

 

ఇక ఈ నిర్ణయం వైకాపాకు కొంత నిరాశ కలిగగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ పార్టీ వచ్చే నెల నుండి పంట రుణాల మాఫీ చేయమంటూ రైతులను కలుపుకొని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉద్యమాలు మొదలు పెట్టాలని భావించింది. కానీ అంతకంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం రుణాల మాఫీ ప్రక్రియ మొదలు పెడుతోంది కనుక తన ఉద్యమ ఆలోచనకు రైతుల నుండి అంతగా స్పందన రాకపోవచ్చును. ఇది వైకాపాకు కొంచెం నిరాశ కలిగించే విషయమే.