ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం...బయటపడ్డ 36 మంది ట్రైనీ ఐఏఎస్ లు


ఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఏపీ (రాజధాని) ఎక్స్ ప్రెస్ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ వద్ద అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రెండు ఏసీ బోగీలు (బీ6, బీ7) పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో రెండు బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గ్వాలియర్‌ సమీపంలోని బిర్లానగర్‌ రైల్వేస్టేషన్‌ వద్దకు రాగానే బోగీల్లో మంటలు చెలరేగడంతో.. వెంటనే విషయాన్ని గమనించిన ప్రయాణికులు చైన్‌ లాగి రైలును నిలిపివేశారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా ఈ ప్రమాదం నుంచి 36 మంది ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ప్రయాణికులు సామాగ్రి మాత్రం మంటల్లో కాలిపోయింది.