కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ముందు హాజరైన ఏపీ సీఎస్

ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి పార్టీ రంగులు వేసిన విషయంలో ఈ రోజు హైకోర్టు ముందు ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం సహానీ హాజరయ్యారు. ఆమెతో పాటు ఏపీ పంచాయత్ రాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజ శంకర్ హాజరయ్యారు. ప్రభత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులు తొలగించాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పివ్వగా, దానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా, అక్కడ కూడా చుక్కెదురయ్యింది. దానితో ఏపీ హైకోర్టు ప్రభుత్వ కార్యాలయాల రంగులు తొలగించేందుకు గడువు విధించింది. ఐతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్తగా మరో జీవో తెచ్చి ఉన్న రంగులకు అదనంగా టెర్రకోట రంగు (మట్టి రంగు) వేయాలని 623 నంబరు జీవో ఇచ్చింది. ఐతే దీని పై స్పందించిన హైకోర్టు ఆ జీవో ను రద్దు చేసి ఎటువంటి పరిస్థితులలోను ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులు తొలగించాలని, అలాగే ఏపీ సీఎస్, పంచాయత్ రాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజ శంకర్ ల పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని అలాగే ఈ విషయంపై వివరణ ఇవ్వడానికి ఆ అధికారులు స్వయం గా హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో సిఎస్ నీలం సహానీ తో కలిసి మిగిలిన ఇద్దరు అధికారులు హాజరయ్యారు. మరో నెలలో రిటైర్ కాబోతున్న సీఎస్ నీలం సహానీ ఇలా కోర్టు ముందుకు రావలసి రావడం కొంత ఇబ్బందికరమే.