సీఎం జగన్ కి చిన్నారి లేఖ.. జగన్ రియాక్షన్

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ కి నాలుగో తరగతి చదువుతున్న ఓ చిన్నారి రాసిన లేఖ అందరినీ కదిలిస్తోంది. స్కూలులో తనతోపాటు చదువుకుంటున్న పిల్లలు ఎవరూ మాట్లాడడం లేదని, తమను ఊరి నుంచి వెలివేశారని చిన్నారి లేఖలో పేర్కొంది. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రపురానికి చెందిన కోడూరి పుష్ప అనే బాలిక ఈ లేఖ రాసింది. తనకో చెల్లెలు గాయత్రి, తమ్ముడు హేమంత్ ఉన్నారని, తన తండ్రి పేరు రాజు, తల్లి పేరు జానకి అని లేఖలో పేర్కొంది. తాత పేరు వెంకటేశ్వర్లు, నానమ్మ పేరు మంగమ్మ అని తెలిపింది.

ఈ నెల 4 వ తేదీ నుంచి తమ ముగ్గురితో స్కూలులో ఎవరూ మాట్లాడడం లేదని, ఎవరైనా మాట్లాడితే రూ. 10 వేల జరిమానా వేస్తామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమను ఊర్లోనుంచి వెలివేశారని అందరూ అంటున్నారని పేర్కొంది. తమతో ఎవరూ మాట్లాడడం లేదని, ఆడుకోవడానికి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు, నాన్న, తాతను చంపేస్తారని స్నేహితులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. తమకు చాలా భయంగా ఉందని పేర్కొంటూ లేఖలో తన తండ్రి ఫోన్ నంబరు, వివరాలను ఇచ్చింది. కాగా, స్థానికంగా ఉన్న ఓ భూ వివాదం కారణంగా వెంకటేశ్వర్లు కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేసినట్టు తెలుస్తోంది. గతంలో ఈ విషయాన్ని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విషయాన్ని చిన్నారి లేఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లింది. చిన్నారి రాసిన లేఖపై సీఎం జగన్ స్పందించారు. దినపత్రికల్లో ఈవార్తను చూసిన ఆయన నేరుగా ప్రకాశం జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌కు ఫోన్‌ చేసి ఆరాతీశారు. వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించి వివరాలు పూర్తిగా కనుక్కుని, సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.