మేం తలచుకుంటే సీట్లలో కూర్చోలేరు...టీడీపీ ఎమ్మెల్యేల మీద జగన్ !

 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఈరోజు బడ్జెట్ సమావేశాల రెండో రోజు కూడా అధికార, ప్రతిపక్షల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సున్నా వడ్డీ రుణాలపై గత టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని జగన్ పేర్కొన్నారు. తానేదో గొప్పగా పథకాలు అమలు చేసినట్లుగా బాబు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగాలు తొలిసారిగా విన్నవారికి గొప్పగా చేశారని అనిపిస్తుందని  సీఎం జగన్ వ్యాఖ్యానించారు. 

వడ్డీలేని రుణాలపై చర్చ సందర్భంగా ప్రభుత్వం నుంచి తీసుకున్న దస్త్రాన్ని సభలో చదివి సీఎం వినిపించారు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ.11,595 కోట్లు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.630 కోట్లు ఇచ్చారని సీఎం తెలిపారు. ఐదేళ్లలో మొత్తం రూ.630 కోట్లు చెల్లించి గొప్పగా చేశామంటున్నారని జగన్ పేర్కొన్నారు. రైతులకు వడ్డీలేని రుణాల కింద 5 శాతం ఇచ్చి గొప్పగా చేశామంటున్నారని ఎద్దేవా చేశారు. 

ఈ సమయంలో సీఎం ప్రసంగానికి టీడీపీ నేతలు అడ్డుతగలడంతో అసహనానికి గురయిన జగన్ మీరు 23 మందే ఉన్నారని, మేము 151 మంది సభ్యులమని గుర్తుంచుకోవాలని అన్నారు. మేమంతా లేస్తే మీ స్థానాల్లో మీరు కూర్చోలేరని అన్నారు. మేం తలుచుకుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేరని హెచ్చరించారు. ప్రతిపక్షం బుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని, పర్సనాలిటీ పెరడగం కాదు, బుర్ర పెంచుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. శాసనసభకు గూండాలను, రౌడీలను తీసుకొచ్చారని జగన్ మండిపడ్డారు.