TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ఏపీ సీఎం సంతాపం.. చంద్రబాబు హుందాతనానికి నిదర్శనం

Published on: Thu Apr 23, 2026 4:50PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బుధవారం (ఏప్రిల్ 22) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక రాజకీయ యోధుడిగా నాదెండ్ల ప్రస్థానం సాగిందని పేర్కొన్న చంద్రబాబు ఆయన మృతి పట్ల  ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

అంతే కాదు నాదెండ్ల భాస్కరరావు భౌతికకాయానికి నివాళులర్పించడమే కాకుండా.. ఆయన కుమారుడు, ప్రస్తుత రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషాద సమయంలో మనోహర్‌కు,  వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేసిన ముఖ్యమంత్రి, నాదెండ్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి నాదెండ్ల భాస్కరరావు పలు సందర్భాల్లో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.

గత కొన్నేళ్లుగా నాదెండ్ల భాస్కరరావు యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా ఎన్టీఆర్, చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా.. చంద్రబాబు వాటన్నింటినీ  పక్కన పెట్టి సీనియర్ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు పట్ల గౌరవం ప్రదర్శించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే..  కానీ మరణం సంభవించినప్పుడు వ్యక్తిగత విభేదాలకు, రాజకీయ  విభేదాలకు తావు ఉండకూడదని చంద్రబాబు నిరూపించారు.

రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయన్న విమర్శల నడుమ.. ముఖ్యమంత్రి చంద్రబాబు హుందాగా వ్యవహరించారు.  గతాన్ని మరిచి, ఒక సీనియర్ నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం ద్వారా చంద్రబాబు తన రాజకీయ పరిణితిని చాటుకున్నారు. ఒకప్పుడు రాజకీయంగా బద్ధశత్రువులుగా ఉన్నప్పటికీ, అంతిమంగా మానవీయతకే చందరబాబు పెద్దపీట వేశారని  రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.  అది పక్కన పెడితే నాదెండ్ల భాస్కరరావు మృతితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగిసినట్లయింది. ముఖ్యమంత్రితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా నాదెండ్ల మృతికి సంతాపం ప్రకటించారు.