ఆయన స్ఫూర్తితోనే పోలవరం నిర్మాణం జరుగుతోంది
posted on May 15, 2019 11:07AM
సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. నీటి విలువ, గొప్పదనం తెలిసిన గొప్ప వ్యక్తి కాటన్ అని.. ఆయన స్ఫూర్తితోనే నీరు-ప్రగతి వంటి జల సంరక్షణ ఉద్యమాలు ప్రారంభించామని పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలను ధాన్యాగారాలుగా కాటన్ తీర్చిదిద్దారన్నారు. ధవళేశ్వరం వద్ద గోదావది నదిపై ఆనకట్ట నిర్మించి కాటన్ చరితార్థుడయ్యాడని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 70 శాతం పూర్తి చేశామని తెలిపారు. జులై నుంచి గ్రావిటీ ద్వారా పోలవరం నీరు అందిస్తామని చెప్పారు. పట్టిసీమ ద్వారా నదుల అనుసంధాన కల నిజం చేశామని.. కృష్ణా డెల్టాలో కరవు ఛాయలను తరిమికొట్టామని గుర్తుచేశారు. ఐదేళ్లలో ఏపీలో 23 జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేశామని చంద్రబాబు వెల్లడించారు.