TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేంద్రానికి వర్తించిన సూత్రమే చంద్రబాబుకి కూడా?

Published on: Mon Feb 9, 2015 1:03PM

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ “కేంద్రానికి ఆర్ధిక ఇబ్బందులు ఉండి ఉండవచ్చు. కానీ, ఆ కారణంగా రాష్ట్రానికి నిధులు విడుదల చేయలేమని చెప్పడం భావ్యం కాదు. ఏవిధమయిన ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి తక్షణ సహాయం చేయాలి. మేమేమీ అధనంగా కోరడం లేదు. ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను, విభజన బిల్లులో రాష్ట్రానికి ఇచ్చిన హామీలనే నేరవేర్చమని అడుగుతున్నాము,” అని అన్నారు.

 

ఆయన కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన నిధులు రాబట్టడంలో వైఫల్యం చెందారని రాష్ట్రంలో ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. అదీగాక రాష్ట్ర ఆర్దికపరిస్థితులు కూడా నానాటికీ క్షీణిస్తున్నాయి. బహుశః అందుకే ఆయన కేంద్రాన్ని అంత గట్టిగా నిలదీసి ఉండవచ్చును. అందుకు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ కూడా సానుకూలంగానే స్పందిస్తూ త్వరలోనే రాష్ట్రానికి మరిన్ని నిధులు విడుదల చేస్తామని మీడియా సమక్షంలో హామీ కూడా ఇచ్చారు.

 

అయితే, కేంద్రం వద్ద నిధులు ఉన్నా లేకున్నా ఇస్తానని హామీ ఇచ్చింది గనుక ఇవ్వవలసిందేనని ఆయన గట్టిగానే అడిగారు. కానీ ఇప్పుడు అదే మాటని పట్టుకొని ఆయన కేంద్రాన్ని ఏవిధంగా నిలదీసి అడిగారో అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్, వైకాపాలు కూడా ఆయన ఎన్నికలలో చేసిన అన్ని హామీలను అమలుచేయమని నిలదీయవచ్చును. తెలంగాణా ఉద్యోగులతో సమానంగా తమకూ 43శాతం వేతన సవరణ చేయాలని కోరుతున్న ఆంధ్రా యన్జీఓ సంఘాలు కూడా అదే మాటను పట్టుకొని ఆయనని నిలదీసినా ఆశ్చర్యం లేదు. ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగా లేనిదీ తాం ఆయనని నిలదీస్తే తప్పేమిటని ప్రతిపక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తే చంద్రబాబు నాయుడికి ఇబ్బందులు తప్పకపోవచ్చును.