గత ప్రభుత్వ అవినీతిపై జగన్‌ సంచలన నిర్ణయం!

 

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు చేపట్టేందుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ హాయంలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. 30 అంశాలపై విచారణ చేయిస్తామని.. ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థల సహకారం తీసుకుంటామని వెల్లడించారు. విద్యుత్‌రంగ సమీక్షా సమావేశంలో ఈమేరకు జగన్ ప్రకటన చేశారు.

కరెంటు కొనుగోళ్లలో అక్రమాలపై దృష్టి పెట్టిన సీఎం జగన్‌.. సోలార్, విండ్‌ పవర్‌ కొనుగోళ్లపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ రేట్లకన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానాకు రూ.2636 కోట్లు నష్టం వాటిల్లిందని, ఈ డబ్బును రికవరీ చేయాలని సీఎం ఆదేశించారు. కంపెనీలతో తిరిగి సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సోలార్, విండ్‌ కంపెనీలు దారికి రాకుంటే వారితో ఒప్పందాలు రద్దుచేయాలని సూచించారు.

సోలార్, విండ్‌ కంపెనీలతో జరిగిన ఒప్పందాల్లో భారీ దోపిడీ జరిగినట్టు స్పష్టమైందన్నారు. ఈ వ్యవహరంలో ఎంతటివారున్నా వదిలిపెట్టొద్దని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులు, అప్పటి మంత్రులు, ముఖ్యమంత్రి ఉన్నా సరే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జగన్ స్పష్టం చేసారు.