ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. సీఎం, సీఎస్ నవ్వులు

 

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో.. ఫొని తుఫానుతో ఉత్తరాంధ్రలో వాటిల్లిన నష్టం, రాష్ట్రంలో నీటి ఎద్దడి, కరవు పరిస్థితులు, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ భేటీకి ముగ్గురు మంత్రులు మినహా మంత్రులంతా హాజరైనట్టు సమాచారం. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సీఎస్, సీఎం ల మధ్య కొద్దిరోజులుగా మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెల్సిందే. అయితే ఈరోజు భేటీలో సీఎస్.. సీఎం పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడటం విశేషం. అదేవిధంగా ఈ భేటీలో.. విపత్తు నిర్వహణ శాఖ, వ్యవసాయ శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శులు సైతం తమ శాఖలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు.

 

 

ఫొని తుఫాను కారణంగా ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.58 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, తదుపరి అంచనాలపై సర్వే జరుగుతోందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో చాలా చోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతోపాటు పలు పంటలకు కూడా నష్టం వాటిల్లినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. తాగునీటి ఎద్దడిపై చర్చ సందర్భంగా రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామని, సాగునీరు అందక చాలా పంటలు ఎండిపోయాయని విపత్తు, వ్యవసాయ శాఖ కార్యదర్శులు వివరించారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల కరవు నేపథ్యంలో ప్రజలు వలసలు వెళ్తున్నారని.. ఉపాధి పనుల్లో నిధుల విడుదలలో జాప్యం జరిగిందని, త్వరితగతిన నిధులు విడుదల చేయాలని అధికారులు కోరినట్లు సమాచారం. ఎన్నికల కోడ్‌ కారణంగా కొత్త పనులేవీ చేపట్టకపోవడంతో ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో గతంలో జారీచేసినటువంటి ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల ఆధారంగానే ఈ పనులు చేపట్టాలని సీఎం సూచించినట్టు సమాచారం.