కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ.. 26 జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం!!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. వీలైనంత త్వరలో నివేదిక ఇవ్వాలని సీఎం కమిటీని ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా కొత్త జిల్లాల ఏర్పాటును పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 

పార్లమెంట్‌ నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 25 జిల్లాలకు పెరగనున్నాయి. అయితే 26వ జిల్లా ఏర్పాటుకు సంబంధించి కూడా కేబినెట్‌ భేటీలో చర్చకు వచ్చింది. అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి.. సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.