బీజేపీకి రాజీనామా..వట్టి పుకార్లే..ఎమ్మెల్యే ఆకుల

 

బీజేపీకి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఖండించారు. ఆ వార్తలు కేవలం పుకార్లేనని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నానని, కేంద్ర మంత్రి సురేష్ ప్రభును కలవడానికి వచ్చినట్లు తెలిపారు. అసలు తానింకా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షానే కలవలేదని వెల్లడించారు. రాజీనామా చేసానన్న పుకార్లను అసలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఉదయం ఆకుల సత్యనారాయణ  అమిత్ షా ను కలిసి తాను బీజేపీకి రాజీనామా చేసినట్లు లేఖ అందించినట్టు వార్తలు వ్యాపించాయి. కమలానికి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఆయన భార్య ఇప్పటికే జనసేనలో కోఆర్డినేటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ  నేపథ్యంలో ఆకుల సత్యనారాయణ కూడా జనసేనలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. ఇదిలా ఉంటే తాను బీజేపీలోనే ఉన్నానని,రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలు వట్టి పుకార్లేనని వెల్లడించి వట్టి మాటలను కట్టి పెట్టారు.