అసెంబ్లీ సంఘటన: అమ్మో... అతనొక సైకో!

 

బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రవేశ ద్వారాన్ని తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకి చెందిన అశోక్‌రెడ్డి అనే వ్యక్తి ధ్వంసం చేశాడు. అతనని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి, స్పీకర్ ప్రవేశించే గేట్ నంబర్ 1 దూకి అశోక్ రెడ్డి లోపలకి ప్రవేశించి విధ్వంసకాండ సృష్టించాడు. మొదట అశోక్‌రెడ్డి మతిస్థిమితం లేని వ్యక్తి అని చెప్పారు. కానీ, అతనొక పెద్ద సైకో అని విచారణలో తేలింది. వరంగల్ జిల్లా పస్రా గ్రామానికి చెందిన 29 ఏళ్ళ అశోక్ రెడ్డి చిన్నప్పటి నుంచి అసాధారణంగా, సైకోలాగా ప్రవర్తించేవాడని తెలుస్తోంది. 2005 సంవత్సరంలో పోడు భూమిని ఆక్రమించిన కేసు ఇతని మీద వుంది. చిన్నతనం నుంచే దొంగతనాలు, నేరాలకు పాల్పడేవాడు. పెళ్ళి చేస్తే బుద్ధి కుదురుతుందని భ్రమించిన పెద్దలు అతనికి పెళ్ళి చేశారు. అశోక్‌రెడ్డి బుద్ధి కుదరకపోగా ఒక ఆడపిల్ల అన్యాయమైపోయింది. అశోక్‌రెడ్డి భార్య ఈ సైకోని భరిస్తూ వస్తోంది. అశోక్‌రెడ్డి సైకో చేష్టలు కొద్ది రోజులుగా ముదరడంతో వైద్యులకు కూడా చూపిస్తోంది. బుధవారం ఉదయం భార్యతో గొడవ పడి బయటకి వచ్చిన అశోక్‌రెడ్డి తన ప్రతాపం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీద చూపించాడు. అశోక్‌రెడ్డిని పోలీసులు రిమాండ్‌కి తరలించారు.