TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం

Published on: Wed Jun 3, 2026 7:28PM

 

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో రోజు రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే మద్యం కొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారాలపై అనేక ఆరోపణలు వెలుగు చూస్తుండగా.. తాజాగా లిక్కర్ రవాణా టెండర్ల లోనూ భారీ అక్రమాలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. లిక్కర్ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేసే బాధ్యత కోసం నిర్వహించిన టెండర్లలో నిబంధనలను పక్కనపెట్టి ఒక ప్రైవేట్ సంస్థకు భారీ ప్రయోజనం కల్పించినట్లు ఈడీ దర్యాప్తులో బయట పడినట్లు తెలుస్తోంది. 

ఢిల్లీకి చెందిన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఈ కాంట్రాక్టులు అప్పగించడం పై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈడీ దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం.. ఇతర పోటీ సంస్థల కంటే దాదాపు 20 శాతం అధిక ధరలను కోట్ చేసినప్పటికీ అదే సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టి నట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. సాధారణంగా తక్కువ ధరను కోట్ చేసిన సంస్థకు టెండర్ దక్కాల్సి ఉండగా.. అధిక రేట్లు పేర్కొన్న సంస్థకు కాంట్రాక్టు ఎలా లభించిందనే అంశంపై అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.

అంతేకాదు.. అక్టోబర్ 2021 నుంచి మార్చి 2024 వరకు లిక్కర్ రవాణా సేవల పేరుతో ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.349.7 కోట్లు చెల్లించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ చెల్లింపులు, టెండర్ ప్రక్రియ, కాంట్రాక్టు కేటాయింపు వెనుక ఉన్న నిర్ణయాలపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. లిక్కర్ స్కాంలో ఇప్పటికే పలు ఆర్థిక లావాదేవీలపై విచారణ కొనసాగుతుండగా.. ఇప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్ కాంట్రాక్టులు కూడా ఈడీ దర్యాప్తు పరిధిలోకి రావడం రాజకీయంగా, పరిపాలనా పరంగా కీలక పరిణామంగా మారింది. ఈ వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.