జేసీ ప్రభాకర్ రెడ్డికి మరో షాక్.. మళ్లీ అరెస్ట్ తప్పదా?

కడప జైలు నుంచి బెయిల్ పై నిన్న విడుదలైన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలకు మరో షాక్ తగిలింది. కడప సెంట్రల్ జైలు వద్ద కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీ ఫ్యామిలీతో పాటు 31 మంది టీడీపీ కార్యకర్తలపై కడప పోలీసులు కేసు నమోదు చేశారు.

 

జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌ రెడ్డిల విడుదల సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జైలు నుంచి భారీ వాహనాల నడుమ తాడిపత్రికి బయల్దేరారు. అయితే, కోవిడ్ కారణంగా వాహన శ్రేణికి పోలీసులు అనుమతించలేదు. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీ ఫ్యామిలీతో పాటు మరో 31 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు, పోలీసులతో వాగ్వాదానికి దిగడంపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. 

 

కాగా, అధికారంలో ఉన్న పార్టీ ఎవరిపైనైనా అక్రమ కేసులు పెట్టగలదని.. అరెస్టులు చేయాలనుకుంటే పెద్దగా కారణాలు అవసరం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించిన కొద్ది గంటల్లోనే ఆయనపై మరో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు, జేసీ ప్రభాకర్‌రెడ్డిని మరోసారి అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.