TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తమిళనాట సంచలనం: బీజేపీకి అణ్ణామలై గుడ్‌బై?

Published on: Mon Jun 1, 2026 3:23PM

దక్షిణాది రాజకీయాల్లో, ముఖ్యంగా తమిళనాడులో అనూహ్యమైన రాజకీయ పరిణామం  సంచలనం రేపుతోంది. తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి  ఫేస్‌గా నిలిచిన ఫైర్‌బ్రాండ్ లీడర్  అణ్ణామలై త్వరలోనే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారనే వార్త ఇప్పుడు తమిళరాజకీయాలలో సంచలనంగా మారింది.  గత దశాబ్ద కాలంగా తమిళనాట కమలం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అహర్నిశలు శ్రమించిన అణ్ణామలై.. ఇప్పుడు అనూహ్యంగా సొంత పంథాను ఎంచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ..  చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

అయితే ఇక్కడి  ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది. కానీ.. ఇటీవలి కాలంలో బీజేపీ అధిష్ఠానంతో ఏర్పడిన తీవ్రమైన సాంస్కృతిక, సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా అణ్ణామలై ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సీనియర్ లీడర్ అయిన అణ్ణామలై  త్వరలోనే బీజేపీకి త  రాజీనామా సమర్పించనున్నారు. పార్టీని వీడిన అనంతరం ఆయన నేరుగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించకుండా, ముందుగా గ్రౌండ్ లెవెల్‌లో ఒక బలమైన స్వచ్ఛంద ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్వచ్ఛంద సంస్థ లేదా సామాజిక ఉద్యమం ద్వారా ప్రజల్లోకి వెళ్లి..  తనకంటూ ఒక ప్రత్యేకమైన క్యాడర్‌ను నిర్మించుకున్న తర్వాత పూర్తిస్థాయి పొలిటికల్ పార్టీని లాంచ్ చేయాలని పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. తమిళనాడు ప్రజలు ద్రవిడ సిద్ధాంతాలకు అలవాటు పడి ఉన్నారని, అక్కడ కేవలం బీజేపీ ముద్రతో ఒంటరిగా గెలవడం అసాధ్యమని అణ్ణామలై  క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందంటున్నారు. తమిళ జనం కమలం వైపు చూడటం లేదని స్పష్టమయ్యాక, అక్కడే ఉండి తన పొలిటికల్ కెరీర్‌ను రిస్క్‌లో పడేసుకోవడం కంటే, ద్రవిడ ముద్ర లేని ఒక సరికొత్త ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నారు.  ఇప్పటివరకు దక్షిణాది రాజకీయాల్లో అణ్ణామలైని చూపిస్తూ ఓట్లు రాబట్టాలని చూసిన బీజేపీకి ఇది కోలుకోలేని  దెబ్బేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అణ్ణామలై లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత దూరం కావడం వల్ల తమిళనాట బీజేపీ ఉనికి  సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది.