అనిత ఓ అనితా!.. టీడీపీలో ఫైర్ బ్రాండ్...
Published on: Thu Mar 24, 2022 4:28PM
అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ లేడీలు ఎవరంటే.. అబ్బో ఆర్కే రోజా, విడదల రజినీ, వాసిరెడ్డి పద్మ.. ఇలా చాలా మంది పేర్లు వరస పెట్టి మరీ చెబుతారు ఎవరైనా. కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ లేడీలు ఎవరంటే మాత్రం.. వేళ్ల మీద లెక్కపెట్టాల్సిందే. అందులో ముందు వరసలో ఉండేది మాత్రం వంగలపూడి అనిత.
ఈ అనిత వందకు వంద శాతం శివకాశీ ఫైర్ బ్రాండ్ సరకు అంటారంతా. అందులో ఏ మాత్రం సందేహం లేదు. అనిత ప్రెస్ మీట్ పెట్టిందంటే.. అధికార పార్టీలోని ఏ మంత్రికో.. ఏ కంత్రీకో కుంకుడు కాయ రసంతో తలంటూ స్నానమే అనే టాక్ అయితే తెలుగుదేశం పార్టీలో సైకిల్ బెల్లా ట్రింగ్ ట్రింగ్ మంటు మోత మోగిపోతోంటొంది. అందుకు ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అధికార పార్టీ నేతలు.. అసెంబ్లీ సాక్షిగా అబాండాలు వేస్త.. వారిని సైకో నా కొడకల్లారా అనడమే కాదు.. ఇకపై మహిళల గురించి ఈ విధంగా మాట్లాడితే.. ఆమె కాలు చెప్పులు తీసి మరీ.. వాటిని చూపిస్తూ.. చెప్పుదెబ్బలు పడతాయంటూ ప్రెస్ మీట్ పెట్టీ మరీ వార్నింగ్ ఇచ్చిన వీర మహిళ ఈ వంగలపూడి అనిత. ఇది సెంట్ పర్సెంట్ కరెక్ట్ అంటోంది సైకిల్ పార్టీలోని లీడర్ నుంచీ కేడర వరకు.
ఇదే ప్రెస్ మీట్లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డినీ నీచుడు అంటూ సంబోధించిందీ అనితా. అదీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రెస్ మీట్ సాక్షిగా అంత మాట అనాలంటే ఎన్నో.. కాదు ఎంతో గట్స్ ఉండాలనే టాక్ అయితే పుసుపు పార్టీలో గట్టిగా ఉంది. అంతేకాదు సీఎం జగన్ మోహన్ రెడ్డిని అలా వదిలేయకండి.. ఆయన్ని ఎవరికైనా చూపించండంటూ వైయస్ విజయమ్మ ఫ్యామిలీ సూచించగల మానవతా వాదీ అనిత. ఇక తెలుగు దేశం పార్టీని పునాదిగా చేసుకుని రాజకీయాల్లోకి ఎదిగిన రోజాను అయితే జబర్దస్త్ హీరోయిన్ అంటు సెటైరికల్ కామెంట్స్తో కడుపుబ్బా నవ్వించే హాస్య చతురత ఈ అనిత సొంతం.
సోషల్ మీడియా సాక్షిగా కూడా అధికార వైసీపీ పరువును గంగలో కలిపేగల కమాండింగ్ ఉన్న మహిళ వంగలపూడి అనిత. అనిత ఓ మాటల ప్రవాహం. అందుకే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలి పదవిని అనితకు కట్టబెట్టారు.
1984, మార్చి 24న విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెంలో వంగలపూడి జన్మించారు. ఆమె ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. 2014 ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావు పేట ఎమ్మెల్యేగా అనిత.. వైయస్ఆర్ సీపీ అభ్యర్థి, సమరసింహరెడ్డి సినిమా నిర్మాత చెంగల వెంకట్రావ్పై 2,828 ఓట్ల మెజార్టీతో గెలుపొంది.. తొలి సారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2018లో టీటీడీ బోర్డ్ సభ్యురాలిగా నాటి టీడీపీ ప్రభుత్వం నియమిస్తే.. ఆమెపై పలు ఆరోపణలు గుప్పించిన నాటి ప్రతిపక్ష వైయస్ఆర్సీపీ.. ఆమెను ఆ పదవిలో నుంచి తొలగించే వరకు నిద్రపోలేదు.
ఇక 2019 ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా కోవ్వూరు అసెంబ్లీ నుంచి బరిలో దిగి.. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నాయకురాలు తానేటి వనిత చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన.. అధైర్య పడకుండా.. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీ బావుంటే.. తామంతా బాగుంటామనే ఓ చిన్న లాజిక్తో ఆ పార్టీలో దూసుకువెళ్తోంది. ఆ క్రమంలో పసుపు పార్టీపై ఈగ కూడా వాలనీయకుండా తెలుగు దేశం పార్టీని ప్రాణానికి ప్రాణంగా చూసుకొంటోందీ వంగలపూడి అనిత. తెలుగుదేశం పార్టీకి బలం కేడరే కాదు.. వంగలపూడి అనితా లాంటి నేతలు కూడా అనే చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది.


