అనిల్ అంబానీ ఆస్తి కరిగిపోయింది.. ఎంత మిగిలిందో తెలిస్తే షాక్!!

 

తన తండ్రి దీరూభాయ్ అంబానీ ఆస్తులను ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు పంచుకున్న తరువాత.. 2008లో ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచ బిలియనీర్ల జాబితాలో.. అడాగ్‌ గ్రూపు అధినేతగా నిలిచిన అనిల్‌ అంబానీ 42 బిలియన్ డాలర్ల ఆస్తులతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల లిస్ట్ లో 6వ స్థానంలో ఉన్నారు. అయితే దశాబ్దం గడిచేసరికి ఆయన ఆస్తి విలువ దారుణంగా పడిపోయింది. ఒకవైపు ధీరూభాయ్ అంబానీ పెద్ద కొడుకు ముఖేష్ అంబానీ ప్రపంచ శ్రీమంతుల్లో ఒకరిగా దూసుకుపోతూ ఉండగా అనిల్ అంబానీ మాత్రం వెనుకబడిపోయారు. పదేళ్ల కిందట అత్యంత శ్రీమంతుల్లో ఒకరిగా నిలిచిన అనిల్ అంబానీ ఆ తర్వాత మాత్రం వెనుబడిపోయారు. ఎంతగా అంటే, ఇప్పుడాయన ఆస్తి కనీసం బిలియన్ డాలర్లు కూడా లేదు. అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం విలువ ప్రస్తుతం కేవలం రూ. 3,651 కోట్లు (523 మిలియన్ డాలర్లు) మాత్రమే.

గత కొన్నాళ్లుగా అనిల్ అంబానీ గ్రూప్ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆయన నేతృత్వంలోని సంస్థలన్నీ నష్టాల్లో కూరుకుపోవడం, అప్పులు పెరగడంతో ఆయన వ్యాపార సామ్రాజ్యం విలువ పాతాళానికి చేరింది. మ్యూచువల్‌ ఫండ్‌ జాయింట్‌ వెంచర్‌ అయిన, రిలయన్స్‌ - నిప్సాన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌ మెంట్‌ లోని తమ 43 శాతం వాటాలను విక్రయించాలని బ్యాంకులు నిర్ణయించుకోవడం, గడచిన 14 నెలల కాలంలో రూ. 35 వేల కోట్లకు పైగా రుణాలను తీర్చడంతోనే అనిల్ అంబానీ ఆస్తి హారతికర్పూరమైంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అనిల్ అంబానీ చెల్లించాల్సిన రుణాల విలువ రూ. 1.70 లక్షల కోట్లకు పైగా ఉండటం గమనార్హం.