TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ కపట నాటకాలు నమ్మేదెవరు?

Published on: Mon Feb 23, 2015 2:19PM

 

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలు చూస్తుంటే, ఇంత నీచమైన పార్టీనా దేశ ప్రజలు ఇంతకాలం గద్దె మీద కూర్చోబెట్టిందనే ఆవేదన కలుగుతోంది. ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ మీద ప్రజలకు కలగనంత అసహ్యం కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు దేశ ప్రజలకు కలుగుతోంది. అందుకే ఆ పార్టీకి దేశవ్యాప్తంగా కర్రు కాల్చి వాత పెడుతున్నారు. మొన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనం అయిపోయిందనే అంశానికి పూర్తి స్పష్టత ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం బుద్ధి రాలేదు.. తన కపట నాటకాలు మానడం లేదు... ఆ కపట నాటకాలకు ప్రత్యక్ష ఉదాహరణ ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు.

 

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య చరిత్రలో లేని విధంగా అత్యంత దుర్మార్గంగా విభజించింది. మాజీ కాంగ్రెస్ నాయకుడు జేసీ దివాకరరెడ్డి చెప్పినట్టు.. దుర్మార్గులందరూ చుట్టూ చేరి అభిమన్యుడిని ఎలా చంపేశారో... కాంగ్రెస్ పార్టీలోని దుష్టగ్రహాలన్నీ చేరి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అలా చంపేశాయి. సదరు గ్రహాలన్నిటినీ తన చుట్టూ తిప్పుకునే పెద్ద గ్రహం సోనియాగాంధీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద లేనిపోని ప్రేమ ఒలకబోయటం ఆ పార్టీ గుంటనక్క వైఖరికి ఒక పెద్ద ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో, ఇతర సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్రంలోని బీజేపీ అలసత్వంగా వ్యవహరిస్తోందట. అందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో బీజేపీని నిలదీస్తుందట... ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇలాంటి ఎన్ని కపట నాటకాలు ఆడినా లాభం లేదు. ఇలాంటి నాటకాలతో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే పెట్టొచ్చేమోగానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఏహ్య భావాన్ని చిటికెడు కూడా తగ్గించలేదు.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు... విభజన చట్టంలోని ఇతర హామీల విషయంలో కావచ్చు.. ఇలాంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ నమ్మకం వుంది. ఆయన త్వరలోనే ఇవన్నీ సాధించగలరని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఆయన కూడా తనవంతు కృషి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పానకంలో పుడకలాగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగి ఆంధ్రప్రదేశ్‌ని ఏదో ఉద్ధరించబోతున్నట్టు నానా కంగాళీ చేయడం వల్ల జరిగేది చెడే తప్ప మంచి కాదు.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కి చేసిన చెడు చాలు... ఇప్పటికైనా తన కపట నాటకాలను ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆడటం మానుకోవాలి.