ఏపీ రాజధాని పేరు ‘తారకరామ నగర్’?

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల్లో ప్రకటించబోతున్నారు. విజయవాడ పరిసరాల్లోనే రాజధాని ఉండాలన్న నిర్ణయానికి రాష్ట్ర మంత్రిమండలి కూడా వచ్చేసింది. రాజధాని ఎక్కడ అనే విషయంలో క్లారిటీ బాగానే వుంది. ఇప్పుడు తాజాగా సరికొత్త అంశం తెరమీదకి వచ్చింది. కొత్త రాజధానికి తెలుగుజాతి కీర్తి పతాకను అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేసిన ఎన్టీఆర్ పేరు కలిసేలా పేరు పెడితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ అభిమానుల్లో అంతర్లీనంగా వున్న అభిప్రాయాన్ని మంగళవారం నాడు బయటపెట్టారు. కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడితే గుంటూరు జిల్లాలో ఎనిమిది వేల ఎకరాల భూమిని ఇవ్వడానికి కూడా రైతులు సిద్ధంగా వున్నారని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు కలిసి వచ్చేలా పేరు పెడితే ఆ పేరు ఎలా వుంటుందన్న ఆలోచన ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానుల్లో మొదలైంది. కొత్త రాజధాని ఏ ఊరిలో ఏర్పడినా కొత్త రాజధానికి ‘తారకరామ నగర్’ అనే పేరు ఉంటుందన్న ఆశాభావాన్ని, ఊహాగానాన్ని ఎన్టీఆర్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.