ఆంధ్రప్రదేశ్ రాజధాని: మైసూరా సలహాలు

 

అంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణానికి ప్రైవేట్ భూములను కొనాలని అనుకోవడం సరికాదని వైసీపీ నాయకుడు ఎంవీ మైసూరారెడ్డి భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రైవేట్ భూములు కొనాలని ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ ఆయన వైసీపీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాజధాని నిర్మాణానికి ప్రైవేట్ భూముల్ని కొనొద్దని ఆయన తన లేఖలో సూచించారు. ఎక్కడైతే 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమి లభిస్తుందో అక్కడే రాజధాని నిర్మాణం జరగాలని ఎందుకంటే, ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి రాజధాని ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని అని ఆయన చెప్పారు. రాజధాని ఎంపిక అందరికీ ఆమోదయోగ్యంగా వుండాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సునిశితంగా ఆలోచించాలని మైసూరా రెడ్డి సూచించారు. రాజధాని కోసం పర్యటనలు జరుపుతున్న శివరామకృష్ణ కమిటీ కొన్ని ప్రాంతాలను సందర్శించనే లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి ప్రైవేట్ భూముల్లో రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బందులొస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.