ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోంది...

 

ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసరాల్లోనే వుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఏ విజయవాడ పరిసరాల్లోని ఏ ప్రాంతంలో రాజధాని అయితే బాగుంటుందన్న విషయంలో పూర్తిస్థాయిలో సర్వే జరుపుతోంది. మోడల్ రాజధానిగా వుండాలంటే ఏ ప్రాంతంలో రాజధాని నిర్మించాలన్న విషయంలో అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుగుదేశం ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. త్వరలో మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుందని, దానిని ఇంటర్నెట్‌లో వుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని, సలహాలు, సూచనలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అన్ని విధాలా అనుకూలంగా వున్న ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటవుతుందని ఆయన అన్నారు.